
హన్మకొండ: ప్రతి ఒక్కరూ నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భవిష్యత్ తరాలకు అందించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నేడు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నీటిని ఒడిసిపట్టి, భవిష్యత్ తరాలకు అందించడంలో కేసీఆర్ కు ఎవరు సాటిరారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల నాటి 27,785 గొలుసుకట్టు చెరువులు, కుంటలను బాగు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పారు. ఇవన్నీ చేశారు కాబట్టే ప్రజలు కేసీఆర్ను అపర భగీరథుడని పొగుడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటి కాలుష్య నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టిందని, పట్టణాల్లో మురుగు నీరు చెరువులు, కుంటల్లో చేరకుండా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తోందన్నారు.